మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అలాంటి మల్కాజ్గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు., మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బోయిన్పల్లిలోని జయలక్ష్మి గార్డెన్స్ లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే అభివృద్ధి కుంటు పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజులోనే కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి 159 ఎకరాల కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ఒప్పించడం గొప్ప విషయం అన్నారు.
ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను మూడు నెలల్లోనే అమలు చేయడం గొప్ప విషయం అన్నారు. హైదరాబాద్ నగరం నాలుగు వైపులా విస్తరించాల్సి ఉందని అందుకోసం మల్కాజ్గిరి వైపు ఐటీ కంపెనీలతోపాటు మల్టిలెవెల్ ఫ్లై ఓవర్లు మెట్రో రైలు రావలసిన అవసరం ఉందన్నారు. 38 లక్షల ఓటర్లు ఉన్న మల్కాజి గిరి పార్లమెంటు సీటు గెలవాలంటే కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు కావాలంటే ఖచ్చితంగా రాష్ట్రం నుంచి ముందుగా గెలవాల్సిన సీటు మల్కాజ్ గిరి అన్నారు అలాగే పార్టీలో పనిచేసే కార్యకర్తలు అందరిని గుర్తించి పార్టీ పరంగా ప్రభుత్వపరంగా తగిన గుర్తింపునివ్వాలని రాష్ట్ర నాయకత్వానికి బండిరమేష్ సూచించారు.