Asaduddin Owaisi: రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక ముందు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కర్ణాటక కలబురిగిలో మీడియాతోమాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘‘క్రమపద్ధతి’’లో లాక్కున్నారని అన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే ఈ రోజు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
Read Also: Bhatti Vikramarka: ధనిక రాష్టాన్ని బీఆర్ఎస్ చేతుల్లో పెడితే ఆగం అయ్యింది..
ముస్లింలు 500 ఏళ్లుగా బాబ్రీ మసీదులో నమాజ్ చేశారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన జీబీ పంత్ యూపీ సీఎంగా ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని ఆరోపించారు. ఆ సమయంలో అయోధ్య కలెక్టర్గా నాయర్ ఉండేవారని, ఆయన మసీదును మూసివేసి, అక్కడ పూజలు చేయడం ప్రారంభించారని అన్నారు. వీహెచ్పీ పుట్టినప్ప్పుడు రామమందిరం లేదని ఓవైసీ అన్నారు.
రామ మందిరం గురించి మహాత్మాగాంధీ ఎప్పుడూ ఏమీ ప్రస్తావించలేదని, చాలా క్రమపద్ధతిలో భారతీయ ముస్లింల నుంచి బాబ్రీని లక్కున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మెజారిటీ వర్గాలను సంతోషపెట్టే పనిలో నిమగ్నమయ్యాయని, మైనారిటీల గురించి మాట్లాడటం లేదని చెప్పారు. ఇండియా కూటమిలో ఉన్న ఆప్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతీ మంగళవారం సుందరాకాండ పారయణం, హనుమాన్ చాలీసా నిర్వహిస్తామని చెబుతున్నారని, దీని గురించి ఎవరూ ఏమీ మాట్లాడటం లేదని, వారంతా మెజారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకునే పనిలో బిజీగా ఉన్నారని అసదుద్దీన్ ఓవైసీ దుయ్యబట్టారు.