ఆసియా కప్ 2025 సమరానికి సమయం ఆసన్నమైంది. మరో కొన్ని గంటల్లో టోర్నీకి తెరలేవనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ మొదటి మ్యాచ్లో (సెప్టెంబర్ 9) అఫ్గానిస్థాన్, హాంకాంగ్ టీమ్స్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ మ్యాచ్.. సెప్టెంబర్ 12న పాకిస్థాన్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ ముందు పాకిస్థాన్, యూఏఈ, అఫ్గానిస్థాన్ టీమ్స్ ట్రై సిరీస్ ఆడాయి. ఈ సందర్భంగా ఓ ఘటన జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ట్రై సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్, యూఏఈ, అఫ్గానిస్థాన్ జట్ల కెప్టెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓ విలేకరి అఫ్గాన్ సారథి రషీద్ ఖాన్కు ఓ ప్రశ్న సంధించాడు. ఆసియాలోనే రెండో అత్యుత్తమ టీమ్ అయిన మీరు ఆసియా కప్ 2025కు ఎలా సన్నద్ధమయ్యారు? అని అడిగాడు. ఆ ప్రశ్నకు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తెగ ఇబ్బందిపడ్డాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో పెద్ద జట్లలో ఒకటైన పాక్ను పసికూన ముందు చిన్నగా చూడడంతో అఘా మొహం మొత్తం మారిపోయింది. తమ టీమ్ దారుణ ప్రదర్శనతో ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే రీతిలో రియాక్షన్ ఇచ్చాడు. అఘా హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాపం సల్మాన్ అఘా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Viral Video: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి కాంపౌండ్ను కూల్చిన అధికారులు.. వీడియో వైరల్!
ట్రై సిరీస్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో అఫ్గానిస్థాను పాక్ ఓడించింది. అయినా కూడా అఫ్గాన్ కంటే చిన్న జట్టుగా పాక్ను చాలామంది పరిగణిస్తున్నారు. సీనియర్ క్రికెటర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ గత కొన్నేళ్లుగా పాక్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఇద్దరు ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఆ ప్రభావం పాక్ జట్టుపై ఇట్టే కనిపిస్తోంది. అయితే ట్రై సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో ఆసియా కప్ 2025లో పాక్ బరిలోకి దిగనుంది. గ్రూప్ స్టేజ్లో టీమిండియా తప్పితే మిగతా జట్ల నుంచి పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. సూపర్ 4లో అఫ్గాన్, శ్రీలంక వంటి టీమ్లు ఎదురవుతాయి. పాక్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.