Asha Sobhana Creates All-Time Record for India: కేరళ స్పిన్నర్ ఆశా శోభన భారత మహిళా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరుగుతున్న నాలుగో టీ20లో శోభనకు చోటు దక్కింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకున్నారు. 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. దాంతో శోభన మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.
భారత మహిళా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అతిపెద్ద వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్గా ఆశా శోభన రికార్డుల్లో నిలిచారు. 33 ఏళ్ల 51 రోజుల వయస్సులో శోభన జాతీయ జట్టులో అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో సీమా పూజారే రికార్డును బద్దలు కొట్టారు. 2008లో రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 31 ఏళ్ల వయసులో సీమా భారత్ తరఫున అరంగేట్రం చేశారు. సీమా, శోభన తప్ప మరే ఇతర భారతీయ మహిళా క్రికెటర్ 30 ఏళ్ల తర్వాత అరంగేట్రం చేయలేదు.
Also Read: MI vs SRH: బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. కాంభోజ్ అరంగేట్రం! తుది జట్లు ఇవే
5 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 3-0 ఆధిక్యంలో ఉండడంతో భారత్ తన ప్లేయింగ్ ఎలెవన్లో రెండు మార్పులు చేసింది. రేణుకా సింగ్ ఠాకూర్ స్థానంలో టిటాస్ సాధు, శ్రేయాంక పాటిల్ స్థానంలో ఆశా శోభన జట్టులోకి వచ్చారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో శోభన సత్తాచాటారు. 10 మ్యాచ్ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు తీశారు. యూపీ వారియర్జ్తో జరిగిన ఓ గేమ్లో 5 వికెట్లను పడగొట్టారు. డబ్ల్యూపీఎల్ 2024 ప్రదర్శనతో భారత సెలక్టర్ల దృష్టిలో ఆశా శోభన పడ్డారు.