AP High Court: ఎన్నికల ఫలితాల ముందు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, హైకోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంది తెలింది ఏపీ హైకోర్టు.. దీంతో.. రేపు సాయంత్రం ఎలాంటి తీర్పు రానుంది అనేది ఉత్కంఠగా మారింది..
ఇక, హైకోర్టులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనల విషయానికి వస్తే.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు చట్ట బద్దత లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. ఏపీలో మాత్రమే ECI ఆదేశాలు అమలు చేయటం దారుణమని.. ఈ ఆదేశాలు వల్ల పోస్టల్ బ్యాలెట్ అంశంలో అనవసర అపోహలు తలెత్తే అవకాశం ఉందని హైకోర్టులో తమ వాదనలు వినిపించింది వైసీపీ.
మరోవైపు.. చట్టానికి లోబడి మాత్రమే ఈ ఆదేశాలు ఇచ్చాము అని హైకోర్టులో వాదించింది ఈసీఐ.. మొదటిసారిగా అసిస్టెంగ్ అధికారులను మేమే నియమించాం.. పేరు, సీల్, డిసిగ్నేశన్ వంటివి ఏమీ లేకపోయినా ఇబ్బంది లేదని పేర్కొంది. ఏపీలో అభ్యంతరం వ్యక్తం చేశారు.. కాబట్టి ఈసీ నుంచి స్పష్టత ఇస్తున్నాం.. ఇది అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తుంది.. ఫెసిలిటెట్ సెంటర్లు ఏర్పాటు చేసిందే ఈసీ అయినప్పుడు ఇబ్బంది ఏం ఉంటుంది? అని ప్రశ్నించింది. ఈసీ నియమించిన సెంటర్లో అధికారులు సంతకం చేస్తే పోస్టల్ బ్యాలెట్ వ్యాలీడ్ అవుతుందని హైకోర్టులో వాదనలు వినిపించింది ఎన్నికల కమిషన్.
ఇక, ఇంప్లిడ్ పిటిషన్ లో టీడీపీ వాదనలు వినిపిస్తూ.. ECI ఆదేశాలకు చట్టబద్ధత ఉందని పేర్కొంది.. అనేక విషయాల్లో గతంలో ఈసీ వెసులుబాటు ఇచ్చింది.. ఇదే మొదటిసారి కాదు అని గుర్తుచేసింది.. పోలింగ్ అధికారులు చేసిన తప్పులకి ఓటర్లను బాధ్యులను చేయటం సరికాదు అని తమ వాదనలు వినిపించింది టీడీపీ.. ఇక, అన్ని వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పు రేపు సాయంత్రం 6 గంటలకు ఇస్తామంటూ.. తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో.. రేపు ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీలో హైకోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.