Andhrapradesh: కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నందున కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి.కృష్ణబాబు వెల్లడించారు. కొవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన మీడియాతో చెప్పారు. ఏపీ నుంచి ఈ సీజన్లోలో కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు ఎక్కువ ఉంటారని.. శబరిమల వెళ్లి వచ్చిన భక్తులకి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామని ఆయన తెలిపారు. 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ప్రతీ గ్రామ సచివాలయానికి పది ర్యాపిడ్ కిట్లు పంపించామన్నారు. ఫీవర్ ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తామన్ని చెప్పారు. ఇందులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో కొవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో పరీక్షలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
జ్వరం, పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు JN-1 కొత్త వేరియంట్లో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారని కృష్ణబాబు తెలిపారు.ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ మాస్క్ ధరించడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏపీలో 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వెంటిలేటర్లకు, కొవిడ్ మందులకి కొరత లేదని కృష్ణబాబు వెల్లడించారు.