ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం కారణంగా 2022లో నమోదైన మరణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2022 మార్చిలో అక్రమ మద్యం సేవించటంతో నమోదైన మరణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: CM Chandrababu: జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు!
ఏలూరు ఎస్పీ కెపీఎస్ కిషోర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటైంది. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వేణు ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. జంగారెడ్డి గూడెంలో నమోదైన అసహజ మరణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని టాస్క్ఫోర్స్కు ఆదేశాలు ఇచ్చారు. అసహజ మరణాలపై జంగారెడ్డి గూడెం పోలీసు స్టేషన్లో నమోదైన కేసుల పరిస్థితిని అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. విచారణ చేసి మరణాలకు బాధ్యులు ఎవరో గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. 2022 మార్చిలో కల్తీ మద్యం తాగి 20 మరణాలు నమోదు అయ్యాయి.