AP Pensions: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని పలువురు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also: Prasanna Kumar Reddy: సీఎంగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..
గ్రామ, వార్డు సెక్రటరీలతో పెన్షన్లు పంపిణీ చేసినా.. వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని పలువురు కలెక్టర్లు వెల్లడించారు. .రూరల్ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కుదురుతుంది కానీ.. అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కొంచెం కష్టతరమవుతుందన్న ఇంకొందరు కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని డిసైడ్ చేయాలంటే.. సచివాలయాల వద్ద టెంట్లు.. తాగు నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్లు కోరారు. ఇవాళ రాత్రికి పెన్షన్ల పంపిణీ మీద గైడ్ లైన్స్ సిద్దం చేస్తామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.