AP CM Jagan: ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ సర్కారు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం 146 కొత్త అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర జెండా ఊపి సీఎం ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం దగ్గర కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొత్త అంబులెన్స్ల కోసం ప్రభుత్వం రూ. 34.79 కోట్లు ఖర్చు చేసింది. 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయం రూ.188.56 కోట్లుగా ఉంది.
Also Read: Telangana Jana Garjana: ఖమ్మంలో కాంగ్రెస్ ‘తెలంగాణ జన గర్జన’ హైలెట్స్ ఇవే..
వారికి ఆ అర్హత లేదు: విడదల రజిని
ఇదిలా ఉండగా.. ఆరోగ్యశ్రీపై మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్కు లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎవరి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైందో చర్చకు సిద్ధమా? దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు, లోకేష్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘‘గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. ఆరోగ్యశ్రీని వెంటిలేటర్పై ఉంచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్ చెప్పగలరా?. 3257 ప్రొసీజర్స్ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్ది’’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదు. మా హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్లు ఖర్చుపెట్టాం. నాలుగేళ్లలో 10,100 కోట్లు ఖర్చుపెట్టాం. వార్షికాదాయం 5 లక్షలు ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం. మా హయాంలో 2275 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందుతుంది’’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.