వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు.. పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు స్వాగతం పలికారు. రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు.. నేడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.
రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ అంశాలు, కూటమి వ్యవహారాలపై కేంద్రమంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఏపీ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక మంతనాలు జరపనున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2న అమరావతికి వస్తున్న నేపథ్యంలో.. అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి కేంద్ర హోం మంత్రికి సీఎం వివరించనున్నట్లు సమాచారం. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ను సీఎం కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో సీఎం చంద్రబాబు షెడ్యూల్:
# ఉదయం 10.30కి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో సమావేశం
# ఉదయం 11.15 గంటలకు కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘవాల్తో భేటీ
# మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశం
# మధ్యాహ్నం 1.40కి అమిత్ షాతో భేటీ