AP BJP: ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసిన నేపథ్యంలో.. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ బీజేపీ.. ఇక, ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది.. అందులో భాగంగా నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్థార్థనాథ్ సింగ్ హాజరై.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్ధులపై బీజేపీ రాష్ట్ర నేతలు చర్చించనున్నారు.. సమావేశంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శలు, జాతీయ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఇక, ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్సీబీ కెప్టెన్
ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ అగ్రనాయకత్వం ఖరారు చేయనుంది.. బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలపై కొంత క్లారిటీ వచ్చింది.. విజయవాడ-వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాలను కూడా కోరుతున్నారు బీజేపీ నేతలు. అదనంగా రాజంపేట అసెంబ్లీ స్థానం కూడా బీజేపీ నేతలు కోరే అవకాశం ఉందట.. రాజంపేట లోక్సభ పరిధిలో మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి సుమారు లక్ష ఓట్లు ఉన్నాయి. క్షత్రియ సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయాలంటే రాజులకే (క్షత్రియులు) ఇవ్వాలని డిమాండ్ ఉంది.. టీడీపీ నుంచి అయితే జగన్మోహన్ రాజు, బీజేపీ అయితే చెంగల్ రాజు కు టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు.. ఇక, రాజమండ్రి-రూరల్ అసెంబ్లీ స్థానం లేదా రాజమండ్రి-అర్బన్ స్థానం నుంచి బీజేపీ పోటీచేయాలని ప్రతిపాదన ఉందట.. తద్వారా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించాలని బీజేపీ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు జరిగే కీలక సమావేశంలో పోటీ చేసే స్థానాలతో పాటు.. అభ్యర్థులపై క్లారిటీకి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.