Anil Kumar Yadav: టీడీపీ-జనసేన విడుదల చేసిన తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సెటైర్లు వేస్తున్నారు.. రానున్న ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలకు పైగా గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇక, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో 8 కోట్ల రూపాయల నిధులతో నిర్మితమవుతున్న 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి, సీతానగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్పై హాట్ కామెంట్లు చేశారు. పవన్ కల్యాణ్ కనీసం 15 శాతం సీట్లు తీసుకోలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన.. 24 సీట్లలో జనసేన కనీసం నాలుగు కూడా గెలవదు అని జోస్యం చెప్పారు.
ఇక, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక పక్క ఉంటే మరో పక్క టీడీపీ, జనసేన, బీజేపీ, షర్మిల ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు అనిల్ కుమార్.. జనసైనికులను చంద్రబాబు కాళ్ల దగ్గర పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టాడు అంటూ మండిపడ్డారు. బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్.. ఎనలేని కృషి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చెందగానే.. ఈ ఓటమికి పొత్తు, పవన్ కల్యాణే కారణమని చంద్రబాబు తప్పుకుంటాడు అంటూ సెటైర్లు వేశారు. రాజనగరంలో జనసేన అభ్యర్థి ప్రకటనతో జక్కంపూడి రాజా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.