NTV Telugu Site icon

Amitabh Bachchan: ఆ భయంతోనే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ చూడలేదు: అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan

Amitabh Bachchan

Amitabh Bachchan didn’t watch T20 World Cup Final: బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్ బచ్చన్‌కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబైలో జరిగే దాదాపు అన్ని మ్యాచ్‌లకు బిగ్‌బీ హాజరవుతారు. షూటింగ్స్ కారణంగా కుదరని సమయంలో టీవీలో అయినా ఆయన మ్యాచ్ వీక్షిస్తుంటారు. అలాంటి అమితాబ్.. భారత్ ఆడిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదట. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా చెప్పారు. రోహిత్ సేన టీ20 ప్రపంచకప్‌ 2024 ట్రోఫీ గెలిచిన విషయం తెలిశాక కళ్లలో నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించడం పట్ల అమితాబ్ బచ్చన్‌ తన బ్లాగ్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే తాను ఎప్పుడు మ్యాచ్ చూసినా భారత్ ఓడిపోతుందని.. అందుకే ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదని తెలిపారు. ‘నేను టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదు. ఎందుకంటే నేను చూసినప్పుడల్లా భారత్ ఓడిపోతుంది. మ్యాచ్ గెలిచిందని తెలిశాక కళ్లలో నీళ్లు వచ్చాయి. ప్రపంచ ఛాంపియన్స్ ఇండియా. భారత మాతాకి జై.. జై హింద్.. జై హింద్’ అని అమితాబ్ పేర్కొన్నారు.

Also Read: Hardik Pandya: అనుకోని విషయాలు జరిగిపోయాయి.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు!

శనివారం రాత్రి బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండోసారి పొట్టి ట్రోఫీని కైవసం చేసుకుంది. 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ 11 సంవత్సరాల ఐసీసీ టైటిల్‌ నిరీక్షణకు ముగింపు పలికింది. భారత్ చివరగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.