NTV Telugu Site icon

SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

Srsp

Srsp

SRSP: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నేటితో 61 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. 1978లో ప్రాజెక్టు పూర్తికాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. 2009లో కాంగ్రెస్‌ సర్కారు హయాంలో ప్రాజెక్టు పైన నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 112 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. పూడిక కారణంగా ఇది 90.313 టీఎంసీల నీటి నిల్వకు పడిపోయింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాల్వలను అందుబాటులోకి తెచ్చారు. నిజామాబాద్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచింది ఈ ప్రాజెక్టు. 60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1983లో టీడీపీ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని నిర్మాణం 1988లో పూర్తి కాగా.. ఆయనే ప్రారంభించారు.

Read Also: MLC Jeevan Reddy: ఇప్పటికైనా మీ విహార యాత్రను ఆపండి.. బీఆర్‌ఎస్‌ పై జీవన్‌ రెడ్డి ఫైర్‌

61 వసంతాలు పూర్తయిన సందర్భంగా, ప్రాజెక్టు వద్ద గల నెహ్రూ విగ్రహానికి ఎస్‌ఈ శ్రీనివాస్ రావు గుప్తా పూలమాల వేశారు. గోదావరి మాతకు పూజలు చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం నుంచి గురువారం 22 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఎగువ గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1072 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26.76 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ఈ ఖరీఫ్ సీజన్‌లో 20 టీఎంసీల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.