Bullet Trains: రైల్వే బడ్జెట్పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైల్వే అధికారులు, అన్ని రాష్ట్రాల మీడియాతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాజా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, హైస్పీడ్–బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, రాష్ట్రాల వారీగా అమలవుతున్న అభివృద్ధి పనులపై కీలక వివరాలు వెల్లడించారు.
మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు ఈసారి రూ.7,611 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించారు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్తో పోలిస్తే దాదాపు 9 రెట్లు ఎక్కువ అని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడుతో పాటు దక్షిణ భారతాన్ని కలుపుతూ చెన్నై – హైదరాబాద్, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్ – బెంగళూరు మార్గాల్లో హైస్పీడ్ “డైమండ్ కారిడార్” ప్రాజెక్టు ప్రతిపాదనలో ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ఈ బడ్జెట్లో రూ. 10,134 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. ఏపీలో మొత్తం రూ. 92,649 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని అన్నారు. చెన్నై – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏపీకి కూడా ఎంతో ఉపయోగపడుతుందని, రాష్ట్రం ఇప్పటికే 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే లైన్లు కలిగిన రాష్ట్రంగా నిలిచిందని గుర్తుచేశారు. అలాగే కలకత్తా – చెన్నై మధ్య నాలుగు రైల్వే లైన్లు ఏర్పాటు పూర్తయ్యాయని వెల్లడించారు.
తెలంగాణకు ఈసారి రూ. 5,454 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని, రాష్ట్రంలో మొత్తం రూ. 48 వేల కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయని చెప్పారు. అలాగే ముంబై – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ తమకు అనేక విలువైన అనుభవాలను అందించిందని అన్నారు.
Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure: ఆఫ్-రోడ్ అడ్వెంచర్లో బెస్ట్ ఏది.?
కర్ణాటకకు రూ. 7,748 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని, అక్కడ మొత్తం రూ. 52,950 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో బెంగళూరు నుంచి రెండు బుల్లెట్ ట్రైన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే అమరావతి కూడా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఒక కీలక భాగంగా ఉండనుందని స్పష్టం చేశారు.
ఇంకా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు చేస్తూ.. రెండో దశలో దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ల గరిష్ట వేగం 350 కి.మీ. ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్లు (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు) త్వరలో సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.