తూర్పుగోదావరి జిల్లా గోదావరి డెల్టా పరిధిలోని మూడు ప్రధాన కాలువలకు ఈరోజు అర్ధరాత్రి నుండి సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. దాంతో డెల్టా పరిధిలోని మూడు కాలువలు గురువారం ఉదయం నుండి మూసివేయనున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పది లక్షల 13వేల ఎకరాల వరి సాగుకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. రబీ పంటలు పూర్తయి కోతలకు రావడంతో సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు.
ఆఖరి రోజు సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుండి గోదావరి డెల్టాకు 8 వేల 4 వందల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మళ్లీ జూన్ ఒకటో తేదీ నుండి డెల్టాలోని మూడు కాలువలకు సాగునీరు విడుదల చేయడానికి సన్నాహాలు చేయనున్నారు. మే నెలలో 366 కోట్ల రూపాయల వ్యయంతో కాలువల మరమ్మతు పనులను చేపట్టానున్నారు. టెండర్లను పిలిచి వెంటనే పనులు చేపట్టడానికి ఇరిగేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల రోజులు వ్యవధిలో కాలువల మరమ్మతు పనులు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు.