Indonesia: ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైదానంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 127మంది మరణించారు. మరో 180మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్ లో జరిగింది. సరదాను పంచాల్సిన మ్యాచ్లో బీభత్సం, హింసా కాండ నడిచింది. ఇండోనేసియాలోని టాప్ లీగ్గా గుర్తింపు పొందిన బ్రి లిగా 1లో భాగంగా శనివారం రాత్రి మలాంగ్ స్టేడియంలో స్థానిక అరేమా ఎఫ్సీ, పెర్సేబయా సురబయా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పెర్సేబయా జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది.
స్థానిక జట్టు అయిన అరేమా ఎఫ్సీ అభిమానులు.. తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. పిచ్ మధ్యలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జి.. టియర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
Read also: up accident: చెరువులో పడ్డ ట్రాక్టర్.. 26మంది మృతి
మలాంగ్లోని స్టేడియానికి హాజరైన ప్రేక్షకులు.. పిచ్ మధ్యలోకి పరిగెత్తుతున్న దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో బ్రి లిగా 1 (BRI Liga 1) లీగ్ను వారంపాటు వాయిదా వేశారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించినట్లు ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేసియా ప్రకటించింది.
Read also:Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఎదురుదెబ్బ.. ఇమ్రాన్ ఖాన్కు అరెస్ట్ వారెంట్
తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ BRI లిగా 1 ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్లోని ఇండోనేషియా పోలీసు చీఫ్ నికో అఫింటా ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. అరేమా ఎఫ్సి – పెర్సెబయా సురబయా మధ్య జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా దాడికి దిగారని తెలిపారు. దీంతో అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని, ఇది కాస్త తొక్కిసలాటకు దారితీసిందన్నారు. ఈ హింసాకాండలో చాలామందికి ఊపిరాడకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.