తెలంగాణలో నిన్న లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటువేసుందకు ముందుకు వచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రెండు గ్రామాల్లో వంద శాతం ఓటింగ్ జరిగి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణలోని ఆ రెండు గ్రామాల ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. లోక్సభ నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్నకొల్వాయిలో వంద శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.
ఇలా వంద శాతం ఓటింగ్కు కృషి చేసిన సెక్టోరల్ ఆఫీసర్ శక్రు నాయక్, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్ అధికారి రాజ్కుమార్ను కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రత్యేకంగా అభినందించారు. అలాగే మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన 62ఏ అదనపు పోలింగ్ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా.. అందరూ ఓటు వేశారు. 95 మంది పురుషులు, 115 మంది మహిళ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పోలింగ్ సిబ్బంది వెల్లడించారు. దీంతో సంగాయిపేట తండా వాసులను అభినందించారు మెదక్ కలెక్టర్.