తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంచడం వంటి పలు అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది… కాగా, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల పరిధిని పెంచుతూ కేంద్రం బీఎస్ఎఫ్కు అధికారం ఇచ్చిన విషయం తెలిసిందే.. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దీదీ.. కేంద్రం చర్యలను తప్పుబట్టారు.. ప్రధానికి ఇప్పటికే లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ప్రత్యక్షంగా సమావేశమయ్యే సందర్భంలోనూ ఈ విషయాన్ని లేవనెత్తుతారని చెబుతారు.
Read Also: ‘బెస్ట్ టూరిజం విలేజ్’ మన భూదాన్పోచంపల్లి..
అయితే, ప్రధాని నరేంద్ర మోడీతో దీదీ మీటింగ్ అసలు ఉంటుందా? అనే చర్చ కూడా సాగుతోంది.. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడే మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలతో ఎప్పుడో చెడింది.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో వచ్చిన గ్యాప్.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడి మళ్లీ దీదీ పీఠం ఎక్కిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది.. బెంగాల్ రాజకీయాల్లో గవర్నర్ ద్వారా కేంద్రం జోక్యం చేసుకుంటుందని దీదీ మండిపడుతూ వస్తున్నారు.. ఏకంగా ప్రధాని సమీక్షలకు కూడా డుమ్మా కొట్టిన సందర్భాలు చర్చగా మారాయి.. ఈ నేపథ్యంలో.. దీదీ-మోడీ భేటీ ఉంటుందా? లేదా? అనే చర్చ కూడా సాగుతోంది.