రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత్కు రాబోతున్నారు. ఏడాదిలోనే రెండోసారి భారత్లో పర్యటించబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సమావేశానికి పుతిన్ హాజరుకాబోతున్నట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ వెల్లడించారు.
వచ్చే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు పుతిన్ హాజరవుతున్నారని దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక సహకార అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత డిసెంబర్లో పుతిన్ భారత్లో పర్యటించారు. తిరిగి ఏడాదిలోపే భారత్కు రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో పుతిన్ జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు మళ్లీ కొన్ని నెలల వ్యవధిలోనే భారత్కు వస్తుండటం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు.. ఈ సంక్షోభ సమయంలో రెండు దేశాల మైత్రి మరింత బలం కానుంది.
