కేంద్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా దేశంలో సాంస్కృతిక, సాహిత్య వికాసం జరిగేందుకు వివిధ అకాడమీల మధ్య సంపూర్ణ సమన్వయం అవసరమని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. అకాడమీలన్నీ కలిసి ప్రతి రెండు, మూడు నెలలకోసారి సమావేశమై తమ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. సోమవారం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ శాఖ పరిధిలోని వివిధ అకాడమీలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read Also: Cm Kcr: బీజేపీ ముక్త్ భారత్ కు అంతా కదిలిరావాలి
ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల గురించిన ప్రగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్, వారణాసి, పుణే, గౌహతిల్లో ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం తదితర అంశాలపై అధికారులు శ్రీ కిషన్ రెడ్డికి వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జోనల్ కల్చరల్ సెంటర్ల (ZCC) ఏర్పాటు ద్వారా నెలకొన్న సందిగ్ధతపై శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాలను రెండు, మూడు జోన్ల పరిధిలోకి విభజించిన కారణంగా తలెత్తుతున్న సమన్వయ లోపంపైనా ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, వివిధ దేశాలతో జరుగుతున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల (Cultural Exchange Programme) పురోగతిని కూడా జి.కిషన్ రెడ్డి సమీక్షించారు.