సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ నడుస్తూనే ఉంది.. తాజాగా.. కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికార ఖాతా పనిచేయకపోవడం చర్చగా మారింది.. ఇటీవల కేంద్రం కొత్త ఐటీ రూల్స్ తేగా.. ట్విట్టర్ వాటికి అంగీకారం తెలపకపోవడంతో వివాదం మొదలు కాగా.. కొందరు బీజేపీ పెద్దల ఖాతాల విషయంలో ట్విట్టర్ వ్యవహారం కేంద్రానికి మరింత కోపం తెప్పించింది… ఇక, ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్ను యాక్సెస్ చేయలేకపోయానని తెలిపారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఒక గంట పాటు నా అకౌంట్ పనిచేయలేదని వెల్లడించారు.. ఆ సమయంలో కేంద్రమంత్రి ఎటువంటి ఫోటోలను కానీ, వీడియోలను కానీ ట్విట్టర్లో షేర్ చేయలేకపోయారు.. టీవీ చర్చలకు సంబంధించిన ఓ వీడియోలను అప్లోడ్ చేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారట.. అయితే.. ఆ పోస్టులు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై తన ట్విట్టర్ ఖాతా పనిచేయలేదని కూడా మంత్రి తెలిపారు.. కాగా, మంత్రి రవిశంకర్ అకౌంట్ మాత్రం నెట్ యూజర్లకు కనిపించింది. కానీ.. ఆయన మాత్రం లాగిన్ కావడానికి లేదా పోస్టు చేయడానికి వీలుపడలేదు.. ఆ సమయంలో డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్ యాక్ట్ నోటీసు వచ్చినట్లు వెల్లడించారు.. ఇక, ట్విట్టర్ చర్యలను ఖండించిన ఆయన.. ఐటీ చట్టంలోని రూల్ 4(8)ను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నారు.. ట్విట్టర్ ఉద్దేశం ఏదైనా.. ఇప్పుడు మరోసారి ట్విట్టర్ వర్సెస్ కేంద్రంగా మారింది పరిస్థితి.