Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ

  • మోడీకి ఫోన్ చేయాలి
  • ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’
  • వెలుగులోకి ట్రంప్ సంభాషణ
Moditrump

Moditrump

ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అనేకమార్లు ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రకటించారు. ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో కూడా మోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియా గోర్.. ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరోసారి సమ్మిట్‌ వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఉదయం 6 గంటలకే ప్రధాని మోడీకి ఫోన్ చేయాలని ట్రంప్ పట్టుబట్టారని.. ఈ ఘటన ఇద్దరు నేతల మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి నిదర్శనమని సెర్గియా గోర్ తెలిపారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో సోమవారం ప్రసంగించిన సెర్జియో గోర్.. ట్రంప్.. ప్రధాని మోడీని తన సన్నిహిత మిత్రుడిగా భావిస్తారని చెప్పారు. ఇటీవల మయామిలో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC) కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనను గురించి సెర్గియా గోర్ తెలియజేశారు. ఆ సమయంలో ట్రంప్.. ప్రధాని మోడీకి వెంటనే ఫోన్ చేయాలని కోరారని చెప్పారు. దానికి తాను.. ‘‘ప్రస్తుతం భారత్‌లో ఉదయం 6 గంటలు మాత్రమే అయింది.’’ అని చెప్పగా.. ట్రంప్ వెంటనే ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే ఉంటారు.’’ అని సమాధానమిచ్చారని గోర్ గుర్తు చేశారు. అనంతరం మరుసటి రోజు మోడీకి ట్రంప్ ఫోన్ చేసినట్లు వెల్లడించారు.

ఈ సంఘటన ఇద్దరు నాయకుల మధ్య ఉన్న నిజమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తుందని గోర్ వ్యాఖ్యానించారు. ‘‘అయినా ఎవరితోనైనా నిజమైన స్నేహం ఉంటే ప్రతి విషయాన్ని ముందుగానే షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉండదు. అధ్యక్షుడు ట్రంప్ నిజంగానే ప్రధాని మోడీని తన మిత్రుడిగా భావిస్తారు.’’ అని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలం నుంచే ప్రధాని మోడీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని వివరించారు. భారతదేశంపై ట్రంప్‌కు ఇప్పటికీ మంచి జ్ఞాపకాలు ఉన్నాయని.. అదే రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు.

భారత్-అమెరికా ప్రభుత్వాలు ప్రస్తుతం వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో స్పష్టమైన ఫలితాలపై దృష్టి సారించాయని గోర్ తెలిపారు. ‘‘మేము ఫలితాల ఆధారంగా పనిచేస్తాం. అమెరికా భారత్‌తో కలిసి చేతులు కలిపి పనిచేయాలని కోరుకుంటోంది.’’ అని గోర్ పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాల భవిష్యత్తుకు రాబోయే రెండేళ్లు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ రెండేళ్లలో తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు రెండు దేశాల సంబంధాలకు బలమైన పునాది వేస్తాయి. ఇప్పుడు మనం నాటే విత్తనాలే భవిష్యత్తులో రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.’’ అని సెర్జియో గోర్ వ్యాఖ్యానించారు.