Site icon NTV Telugu

Asaduddin Owaisi: “టిప్పు సుల్తాన్ ఎప్పుడూ ప్రేమలేఖలు రాయలేదు”.. మాలేగావ్ వివాదంపై ఓవైసీ..

Owaisi

Owaisi

Asaduddin Owaisi: మాలేగావ్‌లో ‘‘టిప్పు సుల్తాన్’’ ఫొటో వివాదం మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ ఫోటో ఉంచడం వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ సప్కల్ టిప్పు సుల్తాన్‌ను ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో పోల్చడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

ఇదిలా ఉంటే, ఈ వివాదంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. టిప్పు సుల్తాన్‌‌ను ఓవైసీ అమరవీరుడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి మద్దతు తెలియజేశారు. సప్కల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. ఈ వివాదం గురించి ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారితో పోరాడుతూ అమరుడయ్యారు. వీర్ సావర్కర్ చేసినట్లు ఆయన బ్రిటిష్ వారికి ప్రేమ లేఖలు రాయలేదు. క్షమాపణలను కోరలేదు. టిప్పు సుల్తాన్ తన కత్తిని తీసుకుని బ్రిటీస్ వారి నుంచి తన దేశాన్ని విముక్తి చేయాలని పోరాడుతూ మరణించాడు. బ్రిటీష్ వీరికి టిప్పు ఎప్పుడూ భయపడలేదు. టిప్పు శరీరం గంటన్నర పాటు పడి ఉన్న, బ్రిటీష్ వారు అతడి వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేదు. టిప్పు వేలు నుంచి తొలగించిన ఉంగరంపై రామ్ అనే పదం ఉంది’’ అని అన్నారు.

Read Also: India vs Pakistan: “వర్షం పడాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను”.. పాక్ మాజీ ప్లేయర్ మాస్టర్ ప్లాన్..

భారత్ వద్ద ఉన్న క్షిపణులు, రాకెట్ టెక్నాలజీ టిప్పు కలల్ని నిజం చేస్తున్నాయని అబ్దుల్ కలాం తన వింగ్ ఆఫ్ ఫైర్ లో రాశారు, ఇది అబద్ధమా..? అని ఓవైసీ ప్రశ్నించారు. మహాత్మా గాంధీ తన యంగ్ ఏజ్ మ్యాగజైన్‌లో టిప్పు సుల్తాన్ హిందూ-ముస్లిం ఐక్యతకు ఉదాహరణ అని రాశారు, దీనిని అబద్ధమని చెప్పగలరా? అని అడిగారు.

అంతకుముందు, కాంగ్రెస్ అధ్యక్షుడు సప్కల్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ ‘‘స్వరాజ్య’’ అనే ఆలోచన కోసం ఎలా ప్రయత్నించారో, బ్రిటీష్ వారిపై యుద్ధానికి టిప్పు సుల్తాన్ అలాగే పిలుపునిచ్చారని అన్నారు. టిప్పు పోరాటం శివాజీ మహరాజ్ ఆదర్శాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ ఒక యోధుడు, భారత పుత్రుడు అని అన్నారు. శివాజీతో సమానంగా టిప్పును మనం పరాక్రమానికి చిహ్నంగా చూడాలని అన్నారు.

Exit mobile version