ప్రధాని నరేంద్ర మోడీ గడ్డం పెంచడంపై కూడా విమర్శలు వచ్చాయి… పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని గడ్డం పెంచుతున్నారంటూ అప్పట్లో విమర్శలు గుప్పించిన టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ… గడ్డం పెంచుకున్నవాళ్లంతా రవీంద్రనాథ్ ఠాకూర్ కాలేరని కామెంట్ చేశారు.. ఇక, గడ్డంపై కాదు.. కరోనా కట్టడిపై దృస్టిసారించండి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోడీకి రూ.100 పంపించడం హాట్టాపిక్గా మారిపోయింది… వంద రూపాయాలు మనీ ఆర్డర్ చేయడమే కాదు.. ఓ లేఖను కూడా పంపాడా వ్యక్తి.. కరోనాతో, లాక్డౌన్లతో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర బారామతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్నాడు అనిల్ మోరే అనే వ్యక్తి.. కరోనా, లాక్డౌన్ల తన అసంతృప్తిని ప్రధాని మోడీకి తెలియజేయాలనుకున్న ఆయన.. ఓ లేఖ రాశారు.. అందులో వంద రూపాయలు కూడా పెట్టారు.. ప్రధాని మోడీ గడ్డం పెంచుతున్నారు.. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి.. దేశంలో వీలైనంత వేగంగా వ్యాక్సిన్ వేయించడానికై ఉంటే మంచిది.. వైద్య సదుపాయాలను పెంచడానికి ప్రయత్నాలు చేయాలి.. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాక్డౌన్లతో కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై దృష్టి పెట్టాలి అని లేఖలో పేర్కొంటూ తన నిరసనను వ్యక్తం చేశారు మోరే.. ఇక, నాకు ప్రధాని మోడీ అంటే ఎంతో గౌరవం, అభిమానం. నేను దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు వంద రూపాయాలు పంపుతున్నాను.. దానితో ఆయన గడ్డం గీయించుకోవాలి అని పేర్కొన్నాడు.. అయితే.. ప్రధాని మోడీని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదన్న ఆయన.. కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేసేందుకే ఇలా చేసినట్టు తెలిపారు. ఆయన ఉద్దేశం ఏదైనా.. ఆ వార్త మాత్రం ఇప్పుడు వైరల్గా మారిపోయింది.