Prashant Kishor: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సర్ప్రైజ్.. వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్

Prashanth Kishore

Prashanth Kishore

తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. టీవీకే 100-108 సీట్లలో లీడ్ చేస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే అనూహ్య ఫలితాలు కనబరచడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో విజయ్ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో సినీ ప్రభావం ఇప్పటికీ బలంగానే ఉందని, సరైన వ్యూహంతో ముందుకెళ్తే విజయ్ రాజకీయాల్లో కీలక శక్తిగా మారే అవకాశముందని ప్రశాంత్ కిషోర్ గతంలో పేర్కొన్నట్లు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్ తమిళగ వెట్రి కజగం తొలి వార్షికోత్సవ సమావేశంలో (ఫిబ్రవరి 26, 2025, మహాబలిపురం) ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ CSKని గెలిపించినట్లు తాను TVKని గెలిపిస్తానని, ఆ తర్వాత తమిళనాడులో ధోనీ కంటే తన పాపులారిటీ ఎక్కువ అవుతుందని హాస్యాత్మకంగా అన్నాడు. ఈ ఎన్నికల్లో TVK బలమైన ప్రదర్శన ఇవ్వడం ఆ మాటలను గుర్తు చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ చెప్పాడు.. అన్నట్టుగానే చేశాడంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సినీ రంగంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత యువత, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అవినీతి వ్యతిరేకత, యువతకు ఉపాధి, విద్య, అభివృద్ధి వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లారు.

టీవీకే విజయంతో తమిళనాడులో ద్రవిడ మున్నెట్రా కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్రా కజగం లకు కొత్త సవాల్ ఎదురవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ రాజకీయ ఎంట్రీని మొదట్లో చాలామంది సందేహంతో చూసినా, తాజా ఫలితాలు ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో సీరియస్ ప్లేయర్‌గా నిలబెట్టే దిశగా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.