జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టు ఆశ్రయించారు.. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుదిన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపి ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది.
ఒమర్ విజ్ఞప్తిలో ఎలాంటి అర్హత లేదని గతంలో ఢిల్లీ హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ 2016లో కుటుంబ న్యాయస్థానం వెలువరించిన ఆదేశాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అబ్దుల్లా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వారిద్దరూ గత 15 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారని, వారి దాంపత్య బంధం దాదాపుగా ముగిసినట్టేనని కోర్టుకు తెలిపారు. వీరి విషయంలో ఆర్టికల్ 142ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. చక్కదిద్దలేనంతగా విఫలమైన వివాహాలను రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని 142(1) అధికరణం కింద తమకు విశేషాధికారం ఉన్నట్లు గతంలో సుప్రీంకోర్టు వెల్లడించింది.