విజయవాడ ఎంపీ సీటు విషయంలో వైసీపీ గేమ్ మార్చాలనుకుంటోందా? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవని సీటును ఈసారి ఎలాగైనా కొట్టాలన్న కసి పార్టీ నాయకుల్లో పెరుగుతోందా? అందుకోసం ఇప్పటినుంచే స్పెషల్ స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారా? దీనికి సంబంధించి ఆ పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలేంటి? కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Shahid Afridi: భారత్పై గెలిచే దమ్ము లేదు.. నమీబియాపై గెలిచి ఇంత బిల్డప్ అవసరమా..
వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అందని ద్రాక్షగా ఉన్న వాటిలో విజయవాడ ఎంపీ సీటు ఒకటి. బెజవాడలో పాగా వేసేందుకు ఎన్ని రకాలుగా ట్రయల్స్ వేసినా వర్కౌట్ అవలేదు. దాంతో… 2029లో ఎలాగైనా విజయవాడలో పాగావేయాలని, గట్టిగా కొట్టాలని డిసైడైందట వైసీపీ అధిష్టానం. అందుకే… థింక్ డిఫరెంట్, ఛేంజ్ ద గేమ్ అంటున్నట్టు సమాచారం. 2014 నుంచి 2024 వరకు వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఇక్కడ పరాజయాన్నే చవిచూశారు. ఇక ఇప్పటి వరకు పార్టీకి గోల్డెన్ పిరియడ్గా చెప్పుకునే 2019 ఎన్నికల్లో సైతం బెజవాడను కైవసం చేసుకోలేకపోయింది వైసీపీ. ఒక రకంగా చెప్పాలంటే… ఇక్కడ గెలుపన్నది పార్టీకి ప్రెస్టీజ్ ఇష్యూ అయిందంటున్నారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కమ్మ ఓటర్ల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరుసగా మూడు ఎన్నికల్లోనూ అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు టిక్కెట్స్ ఇచ్చింది ఫ్యాన్ అధిష్టానం. అయితే… అదే సమయంలో ప్రత్యర్థులుగా టీడీపీ నుంచి కమ్మ అభ్యర్థులే ఉన్నారు. దాంతో… వైసీపీకి క్యాస్ట్ ఈక్వేషన్ అంతగా వర్కౌట్ కాలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. 2014. 19 అనుభవాలు చూశాక… 24లో విజయవాడ ఎంపీ టిక్కెట్ను వేరే కులానికి కేటాయిద్దామని కూడా అనుకున్నారట వైసీపీ పెద్దలు. అనేక తర్జనభర్జనల తర్వాత చివరికి మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికే కేటాయించారు. మూడోసారి కూడా పరాజయమే పలకరించడంతో… ఇక మరో ఆలోచన లేకుండా పూర్తి స్థాయి మార్పులు చేయాలనుకుంటున్నట్టు సమాచారం.
READ MORE: Donald Trump: “ఇది చాలా అవమానం”.. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఫైర్
అలాగే… జిల్లా పార్టీ నేతలు కొన్ని అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ పెట్టాక తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో పొట్లూరి వరప్రసాద్ బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చూశారు. అప్పుడు ఎన్నికలకు కేవలం నెలరోజుల ముందు మాత్రమే పీవీపీని అభ్యర్థిగా ఖరారు చేయడంతో… సరిగా జనంలోకి వెళ్ళలేక పార్టీ గాలి వీచినా ఓడిపోవాల్సి వచ్చిందన్న విశ్లేషణలున్నాయి.ఇక 2024 ఎన్నికల్లో బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ అధిష్టానం అనేక పేర్లను పరిశీలించింది కూడా. క్యాస్ట్ ఈక్వేషన్ను అప్పుడే మార్చాలని అనుకున్నా.. అనూహ్యంగా అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసిపి కండువా కప్పుకోవటంతో మరోసారి కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వక తప్పలేదు. కేశినేని నాని అంతకు ముందు టీడీపీ తరపున గెలిచినా వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగాక మాత్రం ఓటమి తప్పలేదు. దీంతో ఇక్కడ పరాజయానికి కారణాలపై చర్చింతి, డీప్గా అధ్యయనం చేసిన జిల్లా పార్టీ నాయకులు కొన్ని ముఖ్యమైన అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి మార్పులు సూచించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. వరుస ఓటములకు ఇకనైనా చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఉన్న అధిష్టానం కూడా ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటోందట. ప్రతి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి విషయమై చివరి వరకు నిర్ణయం తీసుకోవడం లేదని, కేవలం రోజుల ముందు డిసైడ్ చేయడం కూడా ఓటమికి ఓ కారణం అన్న నిర్ధారణకు వచ్చారు. అందుకే ఈసారి అలా జరక్కుండా ముందే డిసైడ్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశ్యంతో ప్రతిసారి అదే సామాజికవర్గం అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చి దెబ్బతింటున్నందున వచ్చే ఎన్నికల్లో క్యాస్ట్గేమ్ని మార్చాలన్న నిర్ణయానికి కూడా వచ్చారట వైసీపీ ముఖ్యులు. కమ్మ ఓట్ బ్యాంక్ ఎలాగూ తమకు అనుకున్న స్థాయిలో ట్రాన్స్ఫర్ అవడంలేదు కాబట్టి…. నియోజకవర్గంలో ఆ తర్వాతి స్థానంలో ఉన్న కులాన్ని గుర్తించి అదే సామాజికవర్గం అభ్యర్థిని నిలబెడితే… గెలుపు అవకాశాలుంటాయని లెక్కలేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి రకరకాల విశ్లేషణలు చేస్తున్న జిల్లా నాయకులు పూర్తి స్థాయి నివేదికను సవివరంగా అధిష్టానానికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారట. కుల సమీకరణల మార్పు, ముందే అభ్యర్థి ప్రకటన లాంటి ప్రతిపాదనలు ఫైనల్గా ఎంత వరకు అమలవుతాయో చూడాలి.