యూపీ ఎన్నికల్లో ఎన్నో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమయిన యూపీ ఎన్నికలు దేశానికి మార్గనిర్దేశనం చేస్తాయనడంతో అతిశయోక్తి లేదు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఎన్నికల ముందు ఆయాపార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు.
సమాజ్ వాదీ పార్టీ కీలక నేత ఆజంఖాన్ స్టయిలే వేరు. ప్రస్తుతం ఆయన జైలులో వున్నారు. ఆయన తన నామినేషన్ పత్రాలను జైలు నుంచే దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన సీతాపూర్ జైల్లో ఉన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాంపూర్ సదర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భూకబ్జాలతో పాటు ఇతర ఆరోపణలపై 2020 ఫిబ్రవరి నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. ఆజంఖాన్ నామినేషన్ వేసినట్టు ఆయన చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్ ఆసిం రజా తెలిపారు. ఆయనను బెయిల్ పై బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పై బీజేపీ నేత గౌరవ్ భాటియా విమర్శలు చేశారు. ఆజంఖాన్ కు కోర్టు బెయిల్ నిరాకరించినా… అఖిలేశ్ మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. యూపీలో మాఫియా డాన్ లు తాము చట్టానికి అతీతమని భావిస్తుంటారని, నేరగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారని… యోగి సీఎం అయిన తర్వాత వీరంతా భయంతో కాలాన్ని వెళ్లదీస్తున్నారని చెప్పారు. మరోవైపు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలవడనున్నాయి. ఆజంఖాన్ కి ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి మరి.