Site icon NTV Telugu

Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ

Soniagandhi

Soniagandhi

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యను ఎందుకు ఖండించలేదని మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ నిలదీశారు. ‘‘నిశ్శబ్దం తటస్థం కాదు’’ అని పేర్కొన్నారు. అసలెందుకు మౌనం వహించారని తప్పుబట్టారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కాలమ్‌లో ‘‘టెహ్రాన్‌తో న్యూఢిల్లీ సంబంధాలు’’, నాగరికత- వ్యూహాత్మకమైనవి’’ అని సోనియాగాంధీ పేర్కొన్నారు.

ఖమేనీ హత్యపై భారత ప్రభుత్వం స్పందించకపోవడం అంతర్జాతీయ న్యాయ, సార్వభౌమత్వానికి విరుద్ధమని తెలిపారు. ఇది మౌన సమ్మతిగా భావించబడే ప్రమాదం ఉందని చెప్పారు. చర్చలు కొనసాగుతున్న సమయంలో ఒక దేశాధినేతను హత్య చేయడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్రమైన విఘాతంగా పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో భారత్ స్పష్టంగా సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు మద్దతు ఇవ్వకపోవడం దేశ విదేశాంగ విధాన దిశపై సందేహాలు కలిగిస్తోందని అన్నారు.

ఆశ్చర్యంగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులను మాత్రం ప్రధాని మోడీ ఖండించారని.. కానీ వాటికి దారితీసిన పరిణామాలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఖమేనీ హత్యకు కొద్ది రోజుల ముందే ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌ను సందర్శించి.. నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం సమయస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనా వంటి దేశాలు జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్న సమయంలో భారత్ వైఖరి సంప్రదాయ విదేశాంగ సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బడ్జెట్ సమావేశాల రెండో విడతలో పార్లమెంటులో చర్చ నిర్వహించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

Exit mobile version