NTV Telugu Site icon

Karnataka: సీఎం సిద్ధరామయ్య ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు.. రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్..

Cm

Cm

Karnataka: ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించిన సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ‘‘ ఈ కేసులో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి తేవాలి’’ అని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్న అన్నారు. సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ని కొట్టేశారు.

Read Also: CM Chandrababu: నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట..

ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయ చర్చ మొదలైంది. సిద్ధరామయ్య ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా సీఎం ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆయన ఇంటి ముందు భారీ పోలీస్ భద్రతని ఏర్పాటు చేశారు. సీఎంకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో తదుపరి చర్యల గురించి కాంగ్రెస్ నేతలంతా చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టుని సిద్ధరామయ్య ఆశ్రయిస్తారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పు సీఎంకి వ్యతిరేకంగా రావడంతో బీజేపీ తన స్వరాన్ని పెంచింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ మంగళవారం డిమాండ్ చేసింది. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ముఖ్యమంత్రిపై బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. సీఎం రాజీనామా చేసే ప్రశ్నే లేదని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎంకి చెంపపెట్టు అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. గవర్నర్ చర్యల్లో ఎలాంటి తప్పు లేదని బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్య కుటుంబం పేరు వస్తున్నందున గౌరవంగా ఆయన రాజీనామా చేయాలని కోరారు.