Saptapadhi: సాధారణంగా ఎడారిలో నడవాలంటేనే భయమేస్తుంది. అంత ఎండలో నడవటం అంటే చాలా కష్టం. అటువంటి ఎడారిలో సప్తపది ఎంటనీ అనుకుంటున్నారా? ఇది ఏదో సరదాపడి చేసుకున్న సప్తపది కాదు.. ఒక యువతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. వారిలో ఒకరు యువతిని ఎడారిలో గడ్డితో వేసిన మంట చుట్టూ తిప్పుతూ తమ పెళ్లి అయిపోయిందని.. మరెవరిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read also
సిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో జూన్ 1న చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జైసల్మేర్ జిల్లా మోహన్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువతికి ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్ 12న పెళ్లికి ముహూర్తం పెట్టారు. అయితే జూన్ 1న అదే ప్రాంతానికి చెందిన పుష్పేంద్ర సింగ్ అనే యువకుడు.. మరి కొంత మందితో కలిసి యువతిని కిడ్నాప్ చేశాడు. నిందితుడు పుష్పేంద్ర బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్ చేసిన యువతిని ఎడారిలోకి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆమెను తన చేతులతో ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి పెళ్లి జరిగిపోయిందని.. బాధితురాలికి వార్నింగ్ ఇచ్చాడు. తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుల్లో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
Read also
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు జైసల్మేర్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు జూన్ 12న పెళ్లి జరగాల్సి ఉందని తెలిపారు. చాలా రోజుల నుంచి నిందితుడు తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు పోలీసులకు తెలిపారు. పెళ్లిని చెడగొడతానని బెదిరించాడని చెప్పారు. నిందితుల్లో ఒకడ్నే పోలీసులు అరెస్ట్ చేశారని, మిగతా వాళ్లను వదిలేశారని యువతి బంధువులు మండిపడుతున్నారు. నిందితుడి ఆస్తులను జప్తు చేశామని.. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు బాధితులకు హామీ ఇచ్చారు.