Sergio Gor: భారత్‌తో అమెరికా సంబంధాలపై సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు

  • భారత్‌తో అమెరికా సంబంధాలపై సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు
  • అనేక రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడి
Sergio Gor

Sergio Gor

భారత్‌తో సంబంధాలపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్ల రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడంతో పాటు సాంకేతిక సరఫరా గొలుసులను (Technology Supply Chains) బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

ది సిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2026లో ముఖ్య అతిథిగా సెర్గియా గోర్ ప్రసంగించారు. భారత్, అమెరికా కలిసి విలువ గొలుసులను (Value Chains) సమన్వయం చేసుకుని ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చన్నారు. డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో ఉన్న సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచాలనే లక్ష్యంతో ఉన్నారని చెప్పారు. త్వరలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడం ట్రంప్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వివరించారు.

×
×
Ad

పీయూష్ గోయల్..

ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం తొలి దశలోని ప్రధాన అంశాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని.. ప్రస్తుతం తుది వివరాలపై మాత్రమే చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల వెల్లడించారు. అమెరికా సెక్షన్ 301 దర్యాప్తులు, బలవంతపు కార్మిక వ్యవస్థకు సంబంధించిన అంశాల నేపథ్యంలో కూడా భారత్, అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై అమెరికాతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత వాణిజ్య శాఖ స్పష్టం చేసింది.

సెర్జియో గోర్ మాట్లాడుతూ.. భారత్-అమెరికా సంబంధాలు కేవలం ప్రస్తుత ప్రభుత్వాలకు మాత్రమే పరిమితం కావని, అవి విశ్వాసం, స్నేహబంధాలపై నిర్మితమైనవని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థాయి కార్యక్రమాలకు అమెరికా ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా బలమైన మద్దతు అందిస్తున్నాయని తెలిపారు.

ఇటీవలి కాలంలో సాంకేతిక రంగం భారత్-అమెరికా ఆర్థిక సంబంధాల్లో కీలక భాగంగా మారింది. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ (iCET), అనంతరం TRUST కార్యక్రమాల ద్వారా రెండు దేశాలు సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీలు, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ, ఇంధన రంగం, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించాయి.

ఫిబ్రవరి 2026లో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో డేటా సెంటర్లలో ఉపయోగించే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUs) సహా సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంచేందుకు, సాంకేతిక రంగంలో సంయుక్త సహకారాన్ని మరింత విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి.

మరోవైపు భారత్ దేశీయ సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ను అమలు చేస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో సెమీకండక్టర్ పరికరాలు, ముడి పదార్థాలు, భారతీయ సెమీకండక్టర్ మేధోసంపత్తి (IP), దేశీయ-అంతర్జాతీయ సరఫరా గొలుసుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించనుంది.

ఈ రంగంలో ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల ఒడిశా ప్రభుత్వం, ఇంటెల్, అమెరికాకు చెందిన 3D Glass Solutions సంస్థలతో కలిసి 3.3 బిలియన్ డాలర్ల విలువైన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుని అధునాతన సెమీకండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు దిశగా ముందడుగు వేసింది.