కరోనా, మంకీపాక్స్ ఇలా ప్రపంచాన్ని ఏదో ఓ వ్యాధి కలవరపెడుతూనే ఉంది. కరోనా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం కలిగిస్తుంటే.. ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ తో మరో ముప్పు ప్రపంచం ముందర ఉంది. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరాలు వణికిస్తున్నాయి. ఈ స్క్రబ్ టైఫస్ జ్వరాలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
ఈ ఏడాది బెంగాల్ మే నాటికి దాదాపుగా 60కి పూగా స్క్రబ్ టైఫస్ జ్వరాలు నమోదు అయ్యాయి. కూచ్ బెహార్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 80 దాటింది. దీంతో బెంగాల్ వైద్యఆరోగ్య శాక అప్రమత్తం అయ్యారు. కూచ్ బెహార్ జిల్లాలో ఆరోగ్య శాఖ అన్ని గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది. వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. అయతే గతేడాది బెంగాల్ లో కేవలం 4 కేసులు మాత్రమే నమోదు అవ్వగా… ఈ ఏడాది కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగింది.
స్క్రబ్ టైఫస్ వ్యాధికి సాధారణ జ్వర లక్షణాలే ఉంటాయి కానీ అజాగ్రత్తతో వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, నిరంతరం జ్వరం, తక్కువ రక్తపోటు, కొన్ని సందర్భాల్లో దగ్గు, జలుబు, శరీరం అంతా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులకు దోమలు ఎలా కారణం అవుతాయో స్క్రబ్ టైఫస్ జ్వరానికి ట్రాంబికుల్లిడ్ మైట్స్ అనే ఒక రకమైన కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తోంది. ముందుగా గుర్తించినట్లు అయితే ఈ వ్యాధిని ఎదుర్కోవడం సులభం అని.. రోగ నిర్థారణ ఆలస్యం అయితే ప్రాణంతకం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.