పెద్ద నోట్ల (రూ.వెయ్యి, పాత రూ.500 నోట్లు)ను రద్దు చేసిన తర్వాత అంతకంటే మరో పెద్ద నోటును తీసుకొచ్చింది రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆ సంచలన ప్రకటనకు ఈ మధ్యే ఆరేళ్లు పూర్తిఅయ్యాయి.. అయితే, రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త 2000 నోట్లను విడుదల చేశారు.. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నోట్ల రద్దు నిర్ణయం దేశ విదేశాల్లో నేటికీ చర్చనీయాంశంగానే ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపించిందని ఇప్పటికీ ఆర్థికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.. ఇక, నోట్ల రద్దు తర్వాత 2 వేల రూపాయల నోట్లు చెలామణి అవుతున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఆ నోట్ల ముద్రణ కూడా నిలిపివేసినట్లు కథనాలు వచ్చాయి.. అంతేకాదు.. నోట్ల ముద్రణ ఆపేశారంటే.. రూ.2 వేల నోటును కూడా బ్యాన్ విధిస్తారా? మళ్లీ రూ.వెయ్యి నోటికే ఆర్బీఐ మొగ్గుచూపుతుందా? మళ్లీ కొత్త రంగులో 1000 రూపాయాల నోటు విడుదల కానుందా? ఇలా అనే రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.. దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ.
Read Also: Jio True 5G : హైదరాబాదీలకు గుడ్న్యూస్ చెప్పిన జియో..
గత మూడేళ్లలో ఒక్క రూ.2000 నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఆర్టీఐకి అందిన సమాచారం ప్రకారం.. 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో 2000 రూపాయల కొత్త నోట్లను ముద్రించలేదు.. 2016-17 నుంచి 2000 నోట్ల ముద్రణ భారీగా తగ్గిపోయింది. ఆర్టీఐ కింద దాఖలైన అభ్యర్థనకు వచ్చిన సమాధానం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016లో రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత. రూ. 2,000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చింది. అసలు, నకిలీ నోట్ల మధ్య తేడాను ప్రజలు సులువుగా గుర్తించేలా సెక్యూరిటీ ఫీచర్లతో రూ. 2,000 నోటును రూపొందించారు.. అయితే, 2019-20 నుండి ఈ సంఖ్య భారీగా తగ్గిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2016-17, 2018-19 మధ్య ముద్రించిన అవే నోట్లు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. ఇందులో ప్రజల చేతిలో 2000 నోట్లు చలామణి కావడం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే 2000 నోట్లు చాలా వరకు బ్యాంకుల వద్ద ఉండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
మే నెలలో రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం సిస్టమ్లోని మొత్తం 2000 నోట్ల విలువ మార్చి 2021 నాటికి 22.6 శాతానికి, మార్చి 2022 నాటికి 13.8 శాతానికి తగ్గుతూ వచ్చింది.. రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 2022 నాటికి వ్యవస్థలోని మొత్తం నోట్లలో 2000 నోట్ల వాటా 1.6 శాతానికే పరిమితం అయ్యింది.. నోట్ల ముద్రణ నిలిపివేయడం వల్ల ఈ షేర్ మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, 2000 నోట్ల ముద్రణ ఎందుకు జరగడం లేదు? అనే విషయాల్లోకి వెళ్తే.. నిజానికి పెద్ద నోట్ల ముద్రణకు ద్రవ్యోల్బణం అతి ముఖ్యమైన కారణం.. అదే సమయంలో డీమోనిటైజేషన్ వంటి ఊహించని సందర్భాల్లో కూడా పెద్ద నోట్లు సహాయపడతాయి. ఎందుకంటే అదే విలువ కలిగిన నగదును వేగంగా విత్డ్రా చేయడానికి సిస్టమ్ నుండి ఉపసంహరించబడిన నగదు మొత్తాన్ని ముద్రించవలసి ఉంటుంది. స్మాల్ ప్యాక్ ఎకానమీని పరిశీలిస్తే.. ప్రస్తుతం సామాన్యుల షాపింగ్లో పది, ఇరవై, యాభై రూపాయల లోపు సరుకుల ప్యాకెట్లే ప్రధానం కాబట్టి సరిపడా 100, 500 నోట్లను చలామణిలో ఉంచడం వల్ల పనులు సాగుతున్నాయి. అదే సమయంలో సిస్టమ్లోని నోట్లు సరిపోతాయి. అందుకే నగదు కొరత ప్రశ్న లేదు. దీనికి తోడు డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోవడంతో పెద్ద నోట్ల అవసరం కూడా తీరిపోతోందని నివేదికలు చెబుతున్నాయి.
ద్రవ్యోల్బణం, వ్యవస్థలో తగినంత నగదు ఉన్నందున, ప్రభుత్వం ఇప్పుడు కొంత కాలంగా పెద్ద నోట్ల నష్టంపై దృష్టి సారించింది. గతేడాది లోక్సభలో నోట్లను ముద్రించకపోవడంపై ప్రభుత్వం సమాచారం ఇస్తూ.. ప్రభుత్వం పెద్ద నోట్ల ముద్రణను నిలిపివేస్తోందని, తద్వారా తమ నిల్వలను, నల్లధనాన్ని అరికట్టవచ్చని బదులిచ్చారు. దీంతో పాటు 2000 నకిలీ నోటుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.. పెద్ద నోట్ల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అనే భయంతో ప్రభుత్వం వాటి ముద్రణను నిలిపివేసింది. ప్రస్తుతానికి, 2000 నోటుకు సంబంధించి తదుపరి వ్యూహాన్ని రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వం వెల్లడించలేదు. ముందుగా ముద్రించిన 2000 నోట్లు చలామణిలో ఉండొచ్చుగానీ, డేటా ఆధారంగా అయితే రానున్న కాలంలో 2000 నోట్లను జేబులో పెట్టుకునే అవకాశాలు గతంలో కంటే తక్కువగా ఉండటం ఖయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, నల్లధనాన్ని వెలికి తీయడం కోసం.. ఫేక్ కరెన్సీ పని పట్టడం కోస మంటూ.. నోట్లను రద్దు చేసిన మోడీ సర్కార్.. రూ.2000 నోటు తీసుకొచ్చి బోల్తా పడిందనే విమర్శలు ఉన్నాయి. సిస్టమ్లో రూ.2000 నోట్లు లేకపోయినా.. ఐటీ దాడులు, ఏసీబీ దాడులు.. ఇలా ప్రత్యేక సమయాల్లో.. బడా బాబులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల దగ్గర పెద్ద సంఖ్యలో రూ.2000 నోట్లు దొరుకుతున్నాయంటే.. ఖరీదైన కరెన్సీని.. కావాలనే బ్లాక్ చేసి పెట్టారనే విమర్శలు లేకపోలేదు..