Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) రాహుల్ గాంధీపై మాజీ కాంగ్రెస్ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్ లో ఫుల్ క్రేజ్ ఉందని, ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ తేడాతో గెలుస్తారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని వీడియోలు పాకిస్తాన్ మీడియాలో, అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రమోద్ కృష్ణం ఈ వ్యాఖ్యలు చేశారు.
“రాహుల్ గాంధీ పాకిస్తాన్ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తే, భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్ గాంధీ భారత నాయకుల, సంస్థల ప్రకటనలను నమ్మరు. భారత సైన్యం పాకిస్తాన్ కు తగిన సమాధానం ఇచ్చిందని చెప్పితే, రాహుల్ గాంధీ రుజువు కోరుతారు. కానీ పాకిస్తాన్ కు చెందిన నాయకుడు ఏదైనా చెబితే, అతను వెంటనే దానిని నమ్ముతాడు. అందుకే పాకిస్తాన్ ప్రజలు ఆయనను చాలా ప్రేమిస్తారు. ఆయనకు కూడా పాకిస్తాన్ బాగా అభిమానం ఉన్నట్లు అనిపిస్తుంది.’’ అని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్పై ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రమోద్ కృష్ణం నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతీయ విమానాలు ఎన్ని కూలిపోయాయి అని ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి ఆపరేషన్ గురించి పాకిస్తాన్కి ముందే తెలియజేశారని అన్నారు. దీనిపై కృష్ణం మాట్లాడుతూ..‘‘ భారత సైన్యాన్ని, పార్లమెంట్ని, రాజ్యాంగాన్ని ప్రశ్నించడం రాహుల్ గాంధీ అలవాటుగా మార్చుకున్నారు’’ అని చెప్పారు.
Read Also: Miss World 2025: కాసేపట్లో మిస్ వరల్డ్ విజేత ప్రకటన.. ఎలా ఎంపిక చేస్తారంటే.!
‘‘ఒక పిల్లవాడు దారి తప్పినప్పుడు, సాధారణంగా బాగుపడుతాడనే ఆశ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ అంత ప్రముఖ కుటుంబం నుండి వచ్చినప్పటికీ, పూర్తిగా చెడిపోయినట్లు కనిపిస్తాడు. అతను మెరుగుపడే అవకాశం నాకు కనిపించడం లేదు. అయినప్పటికీ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని నేను అతనికి సలహా ఇస్తున్నాను.’’ అని ఆయన అన్నారు. ‘‘ఇందిరా గాంధీ పాకిస్తాన్కు గుణపాఠం నేర్పిన చాలా ప్రజాదరణ పొందిన నాయకురాలు. కానీ ఈ దేశానికి నరేంద్ర మోడీ లాంటి ప్రధాన మంత్రి ఎప్పుడూ లేరు. నేడు, ఆయన వల్ల భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవం, భయాన్ని కలిగి ఉంది’’ అని చెప్పారు.
కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్ ఆర్టికల్ 370 రద్దుని, ప్రధాని మోడీని ప్రశంసించడంపై మాట్లాడుతూ, కాంగ్రెస్ లో తిరుగుబాటు ఎప్పుడో ప్రారంభమైందని, నిజాలు తెలిశాయని, నరేంద్రమోడీ ప్రధాని కాకుంటే రామాలయం ఉండేది కాదని, ట్రిపుల్ తలాక్ రద్దు అయ్యేది కాదని, పాకిస్తాన్కి బలమైన జవాబు ఇచ్చే వాళ్లం కాదని అన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ప్రశంసలకు అర్హుడని పేర్కొన్నారు.