రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వంతగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా” ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలంతా కలసికట్టుగా అడుగు ముందుకేస్తే ఈ దురవస్థ నుంచి బయటపడతామన్నారు. అంతేకాకుండా.. ఎలాంటి రాజకీయ పార్టీ, రాజకీయ వేదికను నేను ఇప్పుడు ప్రకటించను అంటూ స్వంత పార్టీపై క్లారిటీ ఇచ్చారు.
“జన్ సురాజ్” కోసం రాబోయే 3, 4 నెలలో అందరినీ కలిసి మాట్లాడుతానని, నా అభిప్రాయంతో కలిసి వచ్చే వారిని ఈ బృహత్తర ఉద్యమంలో చేర్చుకుంటామని, నేను రాజకీయ పార్టీ పెడితే అది కేవలం ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదు, అందరి పార్టీ గా ఉంటుందన్నారు. బీహార్ ప్రజల సమస్యలు , వారి ఆకాంక్షలను తెలుసుకుంటానని, అక్టోబర్ 2న “చంపారన్ నుంచి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర” ను ప్రారంభిస్తానన్నారు. ఏడాదిలోగా అందరినీ కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తానని, “జన్ సురాజ్” ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరతానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజాసమస్యలు తెలుసుకుంటానని, నా శక్తి సామర్థ్యాలు అన్నిటినీ ఇందుకోసం ఉపయోగిస్తానని, మధ్యలో వదిలి ఎక్కడికి వెళ్ళనంటూ ఆయన వ్యాఖ్యానించారు.