Delhi: ఈ మధ్య కాలంలో రీల్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా.. వ్యక్తులతో సంబంధం లేకుండా రీల్స్ చేస్తున్నారు. అయితే రీల్స్ చేయడమే కాదు.. రీల్స్ చూసి ఈ మధ్య దొంగతనాలు కూడా చేస్తున్నారు. ఇలా రీల్స్ చూసి బ్యాంకులో దొంగతనం చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా రీల్స్ చూసి రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని బ్యాంకు ఉద్యోగిపై దోపిడీకి పాల్పడిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విద్యార్థులు తుపాకీతో బ్యాంకు ఉద్యోగిని బెదిరించి, నగదుతో పాటు ఒక ట్యాబ్లెట్ డివైజ్,ఇతర విలువైన సామగ్రి అపహరించుకుపోయారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ.22,800 నగదు, ఒక ట్యాబ్లెట్ డివైజ్, లోన్ఫారాలు, ఒక బయోమెట్రిక్ స్కానర్ స్వాధీనం చేసుకున్నారు. వీరు బ్యాంకు ఉద్యోగిని బెదిరించేందుకు వినియోగించిన తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన విద్యార్థులంతా సోహనా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు.
Read also: Women Thieves: షిరిడీ రైలులో మహిళా దొంగలు.. బ్యాగులు మాయం చేసిన కిలేడీలు
దొంగతనానికి పాల్పడిన విద్యార్థులను పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. జూలై 5న ఒక బ్యాంకు ఉద్యోగి సోహనా సిటీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను డీజీ గోయంకా యూనివర్శిటీ వెనుక రోడ్డులో వెళుతుండగా గుర్తుతెలియని యువకులు తుపాకీతో తనను బెదిరించి తన బ్యాగు లాక్కుపోయారని ఆరోపించారు. ఆ బ్యాగులో నగదు, ట్యాబ్లెట్ డివైజ్ మొదలైనవి ఉన్నాయని తెలిపారు. బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సోహనాలో ఉంటున్న ఆ నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ తరువాత కోర్టుకు అప్పగించారు. ఈ విద్యార్థులంతా 19 నుంచి 22 సంవత్సరాల మధ్యవయసు కలిగినవారని, వీరంతా నేర పూరితమైన రీల్స్ చూస్తుంటారని.. వాటి ఆధారంగానే ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు మీడియాకు తెలిపారు.