PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. సిల్చార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మధ్య భారతీయుల్లో ఆందోళనల్ని పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు కృషి చేస్తుందని అన్నారు.
భారతదేశ అభివృద్ధిని వ్యతిరేకించే శక్తుల చేతుల్లో కాంగ్రెస్ ‘‘కీలుబొమ్మ’’గా మారిందని ప్రధాని ఆరోపించారు. ‘‘మన దేశ పౌరులు సాధ్యమైనంత తక్కువ కష్టాలను ఎదుర్కొనేలా చూసుకోవడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ యుద్ధం దేశ పౌరులపై ప్రభావాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ కీలక సమయంలో, కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తన పాత్రను నిర్వర్తిస్తుందని భావించారు. అయితే, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలకమైన పనిలో కాంగ్రెస్ మరోసారి విఫలమైంది’’ అని దుయ్యబట్టారు.
దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని, తద్వారా వారు తనపై దుర్భాషలాడొచ్చని మోడీ అన్నారు. భాత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేని శక్తుల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ను అస్సాంలో తుడిచిపెట్టేశారని, త్వరలో వందేళ్ల పరాజయాలను చవిచూడబోతోందని ప్రధాని సెటైర్లు వేశారు. దేశంలోని ప్రతీ రాష్ట్రం కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పుతుందని అన్నారు. నిరాశతో కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్పితే, వారికి వేరే మార్గం కనిపించడం లేదని ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనల్ని ప్రస్తావిస్తూ ప్రధాని విమర్శించారు.