Site icon NTV Telugu

PM Modi: న్యాయాధికారులకే రక్షణ లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి..? మమతపై మోడీ ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం విమర్శలు గుప్పించారు. మాల్దా ఘటనలో న్యాయాధికారుల్ని నిర్బంధించిన ఘటనపై మోడీ మాట్లాడారు. మాల్దా ఘటన టీఎంసీ ‘‘మహా జంగిల్ రాజ్’’కు నిదర్శనమని ఆయన అభివర్ణించారు. బెంగాల్‌లో శాంతిభద్రతలకు అంత్యక్రియలు జరిపించాలని మమతా సర్కార్ కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు.

కూచ్ బెహార్ జిల్లాలో తొలిసారి ప్రధాని మోడీ తొలి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మాల్దాలో న్యాయాధికారులను ఎలా బందీలుగా పట్టుకున్నారో దేశం మొత్తం చూసిందని మోదీ అన్నారు. న్యాయమూర్తుల భద్రతను, రాజ్యాంగపరమైన ప్రక్రియలను కూడా రక్షించలేని ప్రభుత్వం, ఏ రకమైన ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వం బెంగాల్ ప్రజలను సురక్షితంగా ఉంచుతుందని మనం ఆశించలేమని చెప్పారు. న్యాయాధికారులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. మాల్దా ఘటన టీఎంసీ మహా జంగిల్ రాజ్‌కు ఒక నిదర్శమని ఆరోపించారు.

Read Also: Donald Trump: ఇరాన్‌తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..

మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, టీఎంసీ ప్రభుత్వం ఏ ఒక్క రాజ్యాంగ సంస్థకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని మోడీ ఆరోపించారు. ఈ నిర్దాక్షిణ్యమైన టీఎంసీ పరిపాలన, బెంగాల్ అనే పవిత్రగడ్డపై ప్రజాస్వామ్యం ప్రతీరోజు రక్తమోడుతోందని అన్నారు. ఇక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని మోడీ అన్నారు.

మాల్దా ఘటన బుజ్జగింపు రాజకీయాలు, చొరబాట్ల ద్వారా టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ భవిష్యత్తును, గుర్తింపును ప్రమాదంలో పడేసిందని మోడీ ఆరోపించారు. టీఎంసీ పాలనలో బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రమాదకరమైన జనాభా మార్పు చోటుచేసుకుంది. ఈ చొరబాటుదారులకు టీఎంసీ సిండికేట్ నుంచి ప్రత్యక్ష రక్షణ లభిస్తోందని, దీంతో రాష్ట్ర ప్రజలకు ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు. చొరబాటుదారులను కాపాడేందుకు టీఎంసీ పౌరసత్వ సవరణ చట్టాన్ని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తోందని కూడా ప్రధాని ఆరోపించారు.

Exit mobile version