కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన PM కేర్స్ నిధి కార్యక్రమం ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. విరాళాల రూపం వచ్చిన మొత్తంలో సగం కూడా ఖర్చు చేయడం లేదు. అంతేకాదు… PM కేర్స్ కింద కొనుగోలు చేసిన మేడిన్ ఇండియా వెంటిలేటర్లు గొడ్లకు పరిమితం కావడం విమర్శలకు దారితీస్తోంది.
కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు PM కేర్స్ ఫండ్ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని రకాల అత్యవసర వైద్యలు అందించేందుకు నిధులు సమకూర్చేందుకు ఇది ఏర్పాటయ్యింది. తొలి ఏడాది PM కేర్స్ ఫండ్కు 7 వేల 14 కోట్ల రూపాయల విరాళంగా వచ్చాయి. అందులో 3 వేల 976 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. 2020 మార్చి నుంచి 2021 మార్చి మధ్య కాలంలో PM కేర్స్ ఫండ్కు 7 వేల 676 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. ఈ మొత్తంలో 495 కోట్ల రూపాయలు విదేశాల నుంచి వచ్చాయి. కాగా, అంతకు ముందు సంవత్సరం ఖర్చు కాని 3 వేల 77 కోట్లతో పాటు వడ్డీ రూపంలో సమకూరిన 235 కోట్ల రూపాయలతో PM కేర్స్ నిధి 10 వేల 990 కోట్ల రూపాయలకు చేరింది. అయితే… ఇందులో 64 శాతం నిధులు ఖర్చే కాలేదు.
గత ఏడాది మార్చిలో PM కేర్స్ నుంచి 3 వేల 976 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అందులో 6 కోట్ల 60 లక్షల డోసుల కరోనా వ్యాక్సీన్ కోసం 13 వందల 92 కోట్ల రూపాయలు చెల్లించారు. అలాగే, 50 వేల మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్ల కొనుగోలుకు మరో 13 వేల 11 కోట్ల రూపాయలు వెచ్చించారు. అయితే, పలు PM కేర్స్ ఫండ్స్తో కొన్న వెంటిలేటర్లలో చాలా వరకు నిరుపయోగంగా మిగిలిపోయాయి. లోపాల కారణంగా కొన్ని మూలకు చేరితే… శిక్షణ పొందిన వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ఇంకొన్నింటిని పక్కన పెట్టారు. గత ఏడాది నవబంర్లో జమ్మూ-కాశ్మీర్లో నిర్వహించిన ట్రయల్ రన్లో వంద వెంటిలేటర్లు పనిచేయలేదు. అలాగే, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ఆస్పత్రుల్లో కూడా ఉపయోగించే సిబ్బంది లేకపోవడం వల్ల వెంటిలేటర్లను పక్కనపెట్టేసిన విషయం గత మే నెలలో వెలుగు చూసింది.
ఇదిలా ఉంటే, 2020 లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ వలస కూలీల కోసం వెయ్యి కోట్ల రూపాయలు పక్కన పెట్టారు. అలాగే, సెకండ్ వేవ్ సమయంలో నెలకొన్ని తీవ్ర ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు 162 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేశారు. దీని కోసం 201 కోట్ల రూపాయలు వెచ్చించారు. అలాగే, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాబ్లో కరోనా టీకాలను పరీక్షించి విడుదల చేసేందుకు 20 కోట్ల రూపాయలు వెచ్చించారు. బీహార్లోని పాట్నా, ముజాఫర్పూర్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కరోనా ఆస్పత్రులతో పాటు వివిధ రాష్ట్రాల్లో 16 RT-PCR టెస్ట్ ల్యాబ్ల కోసం 50 కోట్ల రూపాయల ఖర్చయ్యింది. మొత్తానికి PM కేర్స్ ఫండ్కు భారీగా విరాళాలు వస్తున్నా… వాటిని వినియోగానికి మాత్రం ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపడం లేదు.