Pinarayi Vijayan: ఇండియా కూటమిలో అలజడి చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే, ప్రతిపక్ష కూటమి సమావేశానికి డీఎంకే దూరమైంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల సమావేశానికి హాజరైనప్పటికీ, ఆమె పార్టీ ముక్కలైంది. ఈ నేపథ్యంలో కూటమిలో కీలకంగా ఉన్న సీపీఎం కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కేరళ మాజీ సీఎం, సీసీఎం నేత పినరయి విజయన్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
ఇటీవల రాహుల్ గాంధీ ఒక పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. పినరయి విజయన్తో రాజకీయ పోరాటం కొనసాగుతున్నందున ఆయనను ఆలింగనం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విజయన్ స్పందిస్తూ.. రాహుల్ వైఖరి వల్లే ఇండియా కూటమి బలోపేతం చేయడం కన్నా, బీజేపీకే ప్రయోజనం చేకూరుస్తున్నారని మండిపడ్డారు. తాము సాధారణంగా ఒకరినొకరు కలిసినప్పుడు చేతులు కలుపుకుంటామని, ఆలింగనం చేసుకోవడం చాలా అరుదని చెప్పారు. అయితే, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకున్న ఫోటోలు తాను చూశానని అన్నారు. మోడీని ఆలింగనం చేసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న రాజకీయ సందేశమే సమస్య అని అన్నారు.
కాంగ్రెస్పై కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే అసంతృప్తిలో లేవని, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా అభ్యంరతాలను వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ వైకరే ఈ పరిస్థితికి కారణమని అన్నారు. ఈ ధోరణి ఇండియా కూటమిని మరింత బలహీనపరుస్తుందని, చివరకు ఇది బీజేపీకి లాభంగా మారుతుందని చెప్పారు. పినరయి వ్యాఖ్యలతో ఇండియా కూటమిలో విభేదాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.

