భారతదేశ ఆహార భద్రతలో , వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో పామాయిల్ కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా పామాయిల్పై దుష్ప్రచారం చేయడం సరికాదని ఈ వారం జరిగిన ఒక కార్యక్రమంలో నిపుణులు అభిప్రాయపడ్డారు. పీహెచ్డీసీసీఐ (PHDCCI) , ఆయుష్ కమిటీ నిర్వహించిన ఈ సదస్సులో ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని పామాయిల్ వినియోగంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) అడ్వైజర్ డాక్టర్ అల్కా రావు మాట్లాడుతూ.. తగిన శాస్త్రీయ ఆధారాలు లేకుండా తాము ఏ ఆహార పదార్థాన్ని సమర్థించమని లేదా విమర్శించమని స్పష్టం చేశారు. అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేయడానికి పామాయిల్ చాలా అనువుగా ఉంటుందని, అందుకే భారతీయ గృహాల్లో , ఆహార పరిశ్రమలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉందని ఆమె తెలిపారు. ప్రజల్లోకి వెళ్లే సమాచారం సమతుల్యంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలని ఆమె సూచించారు.
కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు ఆర్థిక సలహాదారు డాక్టర్ శ్రీ రిషికాంత్ మాట్లాడుతూ.. దేశీయంగా పామాయిల్ సాగును పెంచడం ద్వారా వంట నూనెల దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ ద్వారా రైతులకు మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 025-26 నాటికి పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని 6.5 లక్షల హెక్టార్ల నుండి ఏకంగా 10 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మల్తానీ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ డాక్టర్ వివేక్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల పామాయిల్పై అపోహలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పామాయిల్లో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని, మితంగా తీసుకుంటే ఇది ఆరోగ్యానికి హాని చేయదని పేర్కొన్నారు. అలాగే, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నూనెను ఇచ్చే అత్యంత సమర్థవంతమైన పంట పామాయిల్ అని ఆయన వివరించారు.
బాక్ఫో ఇండియా లిమిటెడ్ ఏవీపీ డాక్టర్ నరేంద్ర త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వంట నూనెలలో మూడో వంతు పామాయిల్ మాత్రమేనని తెలిపారు. “దీని విస్తృత వినియోగం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని సామర్థ్యం, తక్కువ ధర , బహుళ ప్రయోజనాల వల్ల ఇది సాధ్యమైంది. భారత్ వంటి దేశంలో సామాన్యులకు వంట నూనె అందుబాటు ధరలో ఉండాలంటే పామాయిల్ పాత్ర ఎంతో కీలకం” అని ఆయన అన్నారు.
ఈ సదస్సులో నిపుణులు చెప్పిన సారాంశం ఏమిటంటే.. పామాయిల్ అనేది కేవలం చౌకైన ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకు , ఆహార అవసరాలకు ఒక బలమైన భరోసా. కాబట్టి అనవసరమైన ప్రచారాలను నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో దీన్ని చూడాలని వారు కోరారు.
