Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో కీలక ఉగ్రవాది, ప్రధాన సూత్రధారిగా పాకిస్తాన్కి చెందని హషీం మూసాగా గుర్తించారు. ముసాకు పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నట్లుగా మన నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. 26 మందిని క్రూరంగా చంపిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన మూసా పారా-కమాండో శిక్షణ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్లో అతడి ఉగ్రవాద కార్యకలాపాలకు సమర్థవంతంగా ఉపయోగపడిందని భద్రతా వర్గాలు తెలిపాయి.
20 ఏళ్ల మూసా కథువా, సాంబా సెక్టార్ల ద్వారా భారత భూభాగంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ఇతను రాజౌరి-పూంచ్లోని డేరా కి గలి ప్రాంతంలో యాక్టివ్గా మారాడు. ఇతడి లష్కరే తోయిబా మాడ్యుల్ గత ఏడాది నుంచి భద్రతా బలగాలపై దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మూసా గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
Read Also: Pahalgam Terror Attack: ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు చేయడం సహజం: ఎన్ఐఏ వర్గాలు..
పాకిస్తానీ పారా కమాండోలు, ముఖ్యంగా షల్ సర్వీసెస్ గ్రూప్ (SSG) ద్వారా శిక్షణ పొందిన వారు. వీరు అసాధారణ యుద్ధం, మనుగడ వ్యూహాలు, పర్వత ప్రాంతాల్లో పోరాటంలో ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉంటారు. వీరి ట్రైనింగ్లో అధిక ఓర్పుతో నిర్వహించే ఆపరేషన్లు, క్లోజ్ క్వార్టర్స్ యుద్ధం, క్లిష్ట భూభాగాల గుండా ప్రయాణాలు, తప్పించుకోవం వంటివి ఉంటాయి. ఇవన్నీ మూసా కార్యకలాపాల్లో ప్రతిబింబిస్తున్నాయి.
మూసా గత కొంత కాలంగా పోలీసులు, సైనిక గస్తీ నుంచి తప్పించుకున్నాడు. కఠినమైన పర్వతాలు, అడవుల గుండా ప్రయాణిస్తున్నాడు. ముఖ్యంగా, ఆహారం కోసం గ్రామాలకు రావడం మానేశారు, గతంలో ఉగ్రవాదులు స్థానికులపై ఆధారపడటంతో త్వరగా భద్రతా బలగాలకు చిక్కేవారు. పహల్గామ్ సమయంలో M4 కార్బైన్లతో సహా అధునాతన ఆయుధాలను ఉపయోగించడం కఠినమైన సైనిక శిక్షణను సూచిస్తున్నాయి.