PakIstan: పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. తాజా వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చైనా నుండి సైనిక, ఆర్థిక మద్దతుతో ఆధునీకరిస్తోందని వెల్లడించింది. భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తోందని చెప్పింది. పాకిస్తాన్ సైన్యం ప్రాధాన్యతలో ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దు ఘర్షణలు, అణ్వాయుధాల నిరంతర ఆధునీకరణ వంటి లక్ష్యాలు ఉండొచ్చని నివేదిక తెలిపింది.
Read Also: Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘సర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్
‘‘పాకిస్తాన్ భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తుంది, భారతదేశం సాంప్రదాయ సైనిక ఆధిక్యతను భర్తీ చేయడానికి, బ్యాటిల్ ఫీల్డ్ అణ్వాయుధాల అభివృద్ధితో సహా దాని సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుంది’’ అని నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరించడంతో పాటు అణ్వాయుధ పదార్థాల భద్రత, అణు నియంత్రణను కొనసాగిస్తోందని, పాకిస్తాన్ దాదాపుగా విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి సామూహిక విధ్వంసక ఆయుధాలు(Weapons of Mass Destruction) వర్తించే వస్తువులను కొనుగోలు చేస్తోందని నివేదిక తెలిపింది.
ఇటీవల, ఆపరేషన్ సిందూర్లో భారత్ తన ఆధిక్యతను స్పష్టంగా కనబరిచింది. పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను నేలకూల్చడమే కాకుండా, పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ తన 20 శాతం వైమానిక ఆస్తుల్ని కోల్పో్యినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, యూఎస్ నివేదిక రావడం గమనార్హం.