Operation Sindoor: 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టడం ఎవరూ మరిచిపోలేదు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 2025 మే 10వ తేదీ ఉదయం, ఆపరేషన్ సిందూర్ మధ్య తక్షణ కాల్పుల విరమణ కోరుతూ పాకిస్థాన్ డీజీఎంఓ హాట్లైన్ ద్వారా భారత్ను సంప్రదించింది. అయితే, పాకిస్తాన్పై భారత్ చేయాల్సిన దాడులు సగం మిగిలి ఉండటంతో పాక్ అభ్యర్థనను భారత్ వెంటనే ఒప్పుకోలేదని తెలిసింది. ఈ విషయాన్ని టైర్డ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు.
భారత్ మరింత తీవ్రంగా దాడులు చేస్తుందనే భయంతో పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరిందని చౌహాన్ వెల్లడించారు. వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించకుండా మధ్యాహ్నం వరకు సైనిక చర్య కొనసాగించినట్లు చెప్పారు. ఈ వ్యవధిలో పాకిస్తాన్కు చెందిన మొత్తం 11 సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలపై భారత్ దాడులు నిర్వహించిందని వెల్లడించారు. ఈ దాడుల్లో పాక్కు కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కూడా ధ్వంసమైంది. ఈ దాడుల ద్వారా పాకిస్తాన్ లోని ఏ సైనిక స్థావరమైన భారత పరిధిలో ఉందనే స్పష్టమైన సంకేతం ఇచ్చామని అనిల్ చౌహాన్ అన్నారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్తో సహా, రహీమ్ యార్ ఖాన్, భోలారి వంటి స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను ఇప్పటికీ పాకిస్తాన్ మరమ్మతులు చేయించుకుంటోంది.
మే 9వ తేదీ రాత్రి నుండి మే 10వ తేదీ మధ్యాహ్నం వరకు భారత్ దాడులు చేసిన 8 గంటల్లోపే పాకిస్తాన్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిపారు. ఘర్షణలు కొనసాగితే తాము ఘోరంగా ఓడిపోతామని పాకిస్తాన్కు తెలుసని ఆయన అన్నారు. పాకిస్తాన్ ప్రతిదాడుల్ని భారత సైన్యం వేగంగా అంచనా వేయగలిగిందని, అదే నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడ్డాయని, యుద్ధభూమిలో స్పష్టమైన సమాచారంతో భారత్ వ్యూహాతర్మ ఆధిక్యం సాధించిందని చెప్పారు.

