దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. దీంతో వాహనాలు బయటకు తీసేందుకు సామాన్యలు ఆలోచిస్తున్నారు. అసలే కరోనా సమయం. ఉద్యోగాలు లేక రోజురోజుకు జీవనం కష్టమవుతున్న తరుణంలో పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యుడిపై మరింత భారం పడింది. అయితే, మహారాష్ట్రలో ఓ పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ ను రూపాయికే అందించారు. మహారాష్ట్ర యువనేత, మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా డోంబివలీ యువసేన ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో రూపాయికే పెట్రోల్ను అందించారు. దీంతో పెట్రోల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. మరోవైపు అమర్నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంకులో రూ.50కి లీటర్ పెట్రోల్ను అందించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వచ్చిన వారికి ఈ అవకాశం కల్పించారు.