Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్‌, గూగుల్‌పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా..

  • E20 డీప్‌ఫేక్‌లపై మెటా, ఎక్స్, గూగుల్‌పై గడ్కరీ దావా.
  • సివిల్ సూట్‌కు బాంబే హైకోర్టు అనుమతి.
  • E20 విధానంతో తనకు సంబంధం లేదని గడ్కరీ స్పష్టీకరణ.
Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: ఇథనాల్ బ్లెండెడ్ E20 పెట్రోల్‌పై తనను, తన కుటుంబాన్ని తప్పుడు ఆరోపణలతో లింక్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, అసత్య పోస్టులు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వేదికపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సివిల్ పరువు నష్టం దావా వేయనున్నారు. ఇందుకు బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. మెటా ఆధీనంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (X), గూగుల్‌తో పాటు ఈ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు, పేజీలను కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చనున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY), టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT)లను కూడా ప్రతివాదులుగా చేర్చారు.

గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, E20 పెట్రోల్ నిర్ణయం ద్వారా తాను, తన కుటుంబం లాభపడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీడియోలు, ఎడిట్ చేసిన క్లిప్‌లు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ అసత్యమని, దురుద్దేశపూర్వకంగా తన ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ఇలా చేస్తు్న్నారని ఆరోపించారు.

దీంతో పాటు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్, E20 విధానం అమలు, రూపకల్పన, నిర్వహణ మొత్త కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని, తన రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖతో దీనికి ఎలాంటి సంబంధం లేదని గడ్కరీ స్పష్టం చేశారు. డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్, అబద్దపు ప్రచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టును కోరారు. దీంతో బాంబే హైకోర్టు సివిల్ సూట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.

నీట్ పేపర్ లీకేజ్ వివాదంలో యువత ఆందోళన కారణంగా విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ వివాదం ముగిసిన తర్వాత, ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు గడ్కరీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని, ఆయన రాజీనామాను కోరుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత గడ్కరీనే రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీ వేసిన పరువు నష్టం దావా చర్చనీయాంశంగా మారింది.