కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల కమిషనర్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రంతో పాటు నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది.
ఇక రైతుల ఆందోళనలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం కన్పిస్తోందని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. పారిశ్రామిక రంగంపై అన్నదాతల ఆందోళనల ప్రభావం అన్న అంశంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఒక సమగ్ర నివేదికను వచ్చేనెల 10 లోగా సమర్పించాలని ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. కాగా, రైతుల ఆందోళనపై మొదట్లో పట్టించుకోని కేంద్రం.. ఆ తర్వాత కొన్ని దపాలుగా చర్చలు జరిపింది.. చర్చలు సఫలం కాకపోవడంతో.. రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.