Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
నేపాల్:
నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోంది. ఈ నిరసనలు హింసాత్మక అల్లర్లుగా మారాయి. ఆ దేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్తో సహా అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను చుట్టుముట్టి దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది ఆందోళనకారులు మరణించారు. చివరకు అల్లర్లతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది, దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
బంగ్లాదేశ్:
2024 బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనాను గద్దె దించేందుకు విద్యార్థులు పెద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుమట్టడంతో ఆమె భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ఈ అల్లర్లను పూర్తిగా మతోన్మాద శక్తులు ఆధీనంలోకి తీసుకున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత, హిందువులతో పాటు మైనారిటీలపై పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలను రాడికల్ ఇస్లామిస్టులు తగలబెట్టారు.
శ్రీలంక:
2022లో ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం వదిలి పారిపోయేలా చేసింది. నేపాల్ మాదిరిగానే ఈ దేశంలో కూడా యువత నేతృత్వంలో ఉద్యమాలు జరిగాయి. అధ్యక్షుడు ఇంట్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు అందినకాడికి దోచుకెళ్లారు. ఇదే విధంగా నేపాల్, బంగ్లాదేశ్లో జరిగాయి.
పాకిస్తాన్:
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అనేది బయటకు కనిపిస్తుంది, అంతా ఆర్మీ రాజ్యమే నడుస్తుంది. అందరికి తెలిసిన సత్యం. అయితే, దీనిని మార్చాలని భావించిన ఇమ్రాన్ ఖాన్ను 2022లో అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి ఆర్మీ ఈ నిరసనల్ని అణిచివేస్తోంది.